ఇటీవల మచిలీపట్నంలో జరిగిన మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు నమోదు చేశారు.
ఈ హత్య కేసులో మొదటి నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు వినిపిస్తోంది. కొల్లు రవీంద్ర తన అనుచురుడు చింతా చిన్నితో ఈ హత్య చేయించారన్నది మోకా భాస్కరరావు కుటుంబసభ్యుల ఆరోపణ. ఈ నేపథ్యంలో, పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పరిగణిస్తూ ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. గుమ్మటాల చెరువు విషయంలో మోకా భాస్కరరావుకు, కొల్లు రవీంద్రకు వివాదం ఉందని మోకా భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ అంటున్నారు. మోకా భాస్కరరావు గతంలో రెండు పర్యాయాలు బందరు మార్కెట్ యార్డు చైర్మన్ గా వ్యవహరించారు.