నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య ఒకటి నుండి రెండుకు చేరింది. పట్టణ వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం చేసిన కరోనా వ్యాపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
గుంపులుగా జనాలు తిరగాలంటే మరింత ఆలోచించాలి. ముఖ్యంగా అనవసరంగా రోడ్లపైకి రావడం వలన కరోనా వ్యాపించే అవకాశం ఉంది. అధికారులు సూచిస్తున్న విధంగా కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ కు దూరంగా ఉండొచ్చని సిఐ బి.వెంకట్ రెడ్డి తెలుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణానికి చెందిన ఒక మహిళకు కరోనా వైరస్ వ్యాపించినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న అధికారులు అలార్ట్ అయ్యారు. ఈనెల 7వతేదీన కరోనా లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. శుక్రవారం టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
విషయం తెలియడంతో కొల్లాపూర్ ఎసై కొంపల్లి మురళి గౌడ్, కమిషనర్ వెంకటయ్య, వైద్య శాఖ అధికారి రాంమోహన్ అలార్ట్ అయ్యారు. బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధితుల కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటెన్ చేశారు. శనివారం వారికి టెస్టులు చేస్తారని వెల్లడించారు.
ఇంటి చుట్టుప్రాంతాన్ని శానిటేషన్ చేశారు. ఈ సందర్భంగా సిఐ బి.వెంకట్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్కరు మొఖానికి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. గుంపులుగా జనాలు తిరగరాదన్నారు. సూచనలను పాటించి కరోనాకు దూరంగా ఉండాలని కోరారు.