ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అక్కడే పుట్టింది. గతంలోనూ అనేక వైరస్ లు పుట్టాయి. తాజాగా మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. దీని పేరు బ్రుసెల్లోసిస్.
వీటన్నింటికీ పుట్టినిల్లు చైనా. ప్రపంచ దేశాల్లో తయారీ రంగానికి అగ్రస్థానంలో ఉన్న చైనా, నేడు వివిధ వ్యాధుల పుట్టుకకు ప్రధాన కేంద్రంగా మారింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన బ్రుసెల్లోసిస్ క్రమంగా చైనాలోనే విస్తరిస్తోంది.
ఇంకా మిగిలిన దేశాలకు పాకలేదు. చైనాలోని వాయువ్య రాష్ట్రమైన ల్యాన్ ఝౌ నగరంలో ఈ వ్యాధి పురుడు పోసుకుంది. దీన్ని మాల్టాఫీవర్ అని కూడా పిలుస్తారు.
వేగంగా విస్తరిస్తున్న మరో కొత్త వ్యాధి
ప్రమాదకరమైన వ్యాధిగానే భావిస్తున్నారు. ఇంతవరకూ 3,245 కేసులు నమోదైనట్లుగా అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇది జంతువుల నుండి బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది.
ముఖ్యంగా పాశ్చరైజ్ చెయ్యని పాల ఉత్పత్తులు, అపరిశుభ్రమైన ఆహారం ద్వారా మనుషులకు ఈ బ్యాక్టీరియా సోకుతుందని తెలుస్తోంది.
ఈ వ్యాధి సోకిన వారికి జీవితాంతం కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొందరికి సంతాన సాఫల్యతను కోల్పోయే ప్రమాదం వుందనీ అంటున్నారు. వ్యాధి ముదిరే కొద్దీ కాలేయం, గుండె, నాడీ వ్యవస్థపైన తీవ్ర ప్రభావాలు చూపించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
చైనా ల్యాబ్ నుంచి బయటపడిన వైరస్ ఇది
చైనాలోని ల్యాన్ ఝౌ నగరంలో వున్న ఒక వ్యాక్సిన్ తయారీ కేంద్రం నుండి ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు అక్కడి అధికారులు గత సంవత్సరంలోనే గుర్తించినా, ఈ విషయం ఇప్పుడు బయటకు వస్తోంది.
ఆ కంపెనీలో పనిచేస్తున్న 20వేల మందిపై పరీక్షలు జరిపినప్పుడు మూడువేల మందికి పైగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. వీరితో పాటు ఈ నగరంలో చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడం ఊరటనిచ్చే అంశం. కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ ద్వారా ఇది నయం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కీళ్ల కండరాల నొప్పి,వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కరోనా లాగా త్వరిత గతిన ఎక్కువ మందికి వ్యాపించే లక్షణం ఉందా లేదా తేలాల్సి వుంది. కరోనా కూడా చైనాలోని వ్యూహన్ ల్యాబ్ లోనే పుట్టిన వైరస్ గానూ, వైరస్ రూపంలో ఉన్న మానవ నిర్మిత మరణాయుధంగా ఎక్కువ దేశాలు అనుమానిస్తున్నాయి.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ బ్రూసెల్లోసిస్ పుట్టుకొచ్చింది. ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) ఏం చేస్తుందో తెలియరావడం లేదు. కొత్తగా వచ్చిన ఈ బ్యాక్టీరియా గురించి ఏమేరకు సమాధానం వుందో, అసలు అందిందో లేదో, ఒకవేళ అందినా, డబ్ల్యూ హెచ్ ఓ మౌనవ్రతం పాటిస్తూ ఉందేమో త్వరలోనే బయటపడుతుంది.
మనిషిని తప్పఅన్నింటినీ పీక్కుతినే చైనా
ఇంత ప్రమాదకరమైన జబ్బులకు చైనా అడ్డాగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం ఆహారపు అలవాట్లు. ప్రపంచంలో దాదాపుగా ఏ దేశానికీ లేని వింత ఆహారపు అలవాట్లు చైనాకు ఉన్నాయి. ఒక్క మనిషిని తప్ప అన్ని జంతువులను తినే అలవాటు అక్కడ జనాలకు వుంది.
ఈ మార్కెట్ల ద్వారా వింత వింత వైరస్ లు, బ్యాక్టీరియాలు పుట్టుకొచ్చి, వ్యాధుల రూపాలను సంతరించుకొని, మానవుల్ని పీడిస్తున్నాయి. ఈ దేశస్థులు సర్వ జీవాలకు హాని చేస్తున్న తీరు, చివరికి మనిషికే పెద్దహానిగా మారింది. చైనాదేశ ఆహారపు అలవాట్లు మెల్లగా మిగిలిన కొన్ని దేశాలకు వ్యాప్తిచెందుతున్నాయి.
ఆ మూల్యాన్ని మిగిలిన దేశ ప్రజలు కూడా చెల్లించే పరిస్థితి వచ్చింది. మన దేశంలోనూ ఇబ్బడి ముబ్బడిగా చైనా రెస్టారెంట్లు ఉన్నాయి.
ఇది ప్రమాదకరమైన ధోరణి
ఇంతకంటే ప్రమాదకరమైంది అక్కడి ప్రయోగశాలల్లో ఇటువంటి వైరస్ లు, బ్యాక్టీరియాలు పురుడు పోసుకోవడం. ఇవి ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా, లేక, మిగిలిన దేశాల వినాశనం కోసం సృష్టిస్తున్నారా, అన్నది ప్రపంచ దేశ మానవాళి మెదడ్లను తొలుస్తున్న ప్రశ్న.
అదే నిజమైతే, చైనా ఈ ప్రపంచం పాలిట విలన్ గా మారినట్లు భావించాలి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు చైనాను నమ్మడం లేదు. రేపు కరోనాకు చైనా నుండి వ్యాక్సిన్ ముందుగా వచ్చినా, ఆ వ్యాక్సిన్ ను తీసుకోడానికి చాలా దేశాలు భయపడతాయి.
అదే సమయంలో, ప్రపంచంలోని చాలా దేశాలకు భారతదేశంపై విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే, కరోనా వ్యాక్సిన్ పంపిణీ, తయారీకి చాలా దేశాలు భారత్ ను ఎంపిక చేసుకుంటున్నాయి.తన ప్రవర్తనతో తనని వెలివేసే పరిస్థితులు చైనాయే కల్పించుకుంటోంది.
భారత్ తో సరిహద్దు యుద్ధం , అమెరికాతో ఆధిపత్య పోరు, కొన్ని దేశాలతో వాణిజ్య, ఆర్ధిక పేచీలు ,యావత్తు ప్రపంచంపై సామ్రాజ్య కాంక్ష పెంచుకుంటూ చైనా ముందుకు వెళ్తోంది. ఈ అంశాల్లో విజయం ఎలా ఉన్నప్పటికీ, వైరస్ లను బ్యాక్టీరియాలను, తద్వారా వ్యాధులను విస్తరించడంలో విజయం సాధిస్తోంది.
అన్ని దేశాలు సామాజిక దూరం పాటించే దుస్థితి చైనా తెచ్చుకుంటోంది.వెరసి,శారీరక, మానసిక వ్యాధులకు పుట్టినిల్లుగా మారింది. చైనాకు పట్టిన అన్నిరకాల జాడ్యాలను అన్ని దేశాలు కలిసి త్వరలోనే వదులుస్తాయి. -మాశర్మ, సీనియర్ జర్నలిస్టు