మొబైల్ పోన్ ద్వారా కూడా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న సందర్భంలో మొబైల్ స్మార్ట్ ఫోనులో తప్పని సరిగా యాంటీ వైరస్ ఉండేటట్లు చూసుకోవాలని ములుగు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ పి.రాములు కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ, ములుగు జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాములు ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్ అంశంపై ప్రసంగించారు. డిజిటల్ బ్యాంకింగ్ సురక్షిత లావాదేవీలలో ఖచ్చితంగా మొబైల్ అలెర్ట్ వచ్చే ఏర్పాటు చేసుకొని ఉండాలని, ఎప్పటి కప్పుడు అనవసరంగా వచ్చే కుకీలను తొలగించుకోవాలని కోరారు. అదే విధంగా తరచూ పాస్ వర్డ్ మార్చుకొని వాడాలని, పాస్ వర్డ్ ఎవరికీ షేరు చేయకూడదని, కనిపించిన ప్రతి యాప్ ను డౌన్ లోడ్ చేయకూడదని ఆయన తెలిపారు.
అపరిచిత వ్యక్తులకు మన క్రెడిట్ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని, ఆకర్షణీయ ప్రకటనలకు, ఉచిత ఆర్థిక బహుమతులకు ఆశ పడకూడదని ఆయన హితవు పలికారు. నగదు రహిత లావాదేవీలలో జాగ్రత్తలు అవసరమని అవగాహన కల్పించారు. ములుగు జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల నాణ్యత, అసలు, నకిలీ, కొలతలు, తూనికలు, గరిష్ట చిల్లర ధరల విషయంలో అప్రమత్తంగా ఉంటూ ధరకు సమానమైన విలువ గల వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పారు.
మోసానికి గురైనట్లైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోద్యాయురాలు ఎన్నం విజయమ్మ, ఉపాధ్యాయులు రాజేందర్, సిరుప సతీష్,దేవ్ సింగ్,సంగ చేరాలు,పిట్టల మల్లయ్య,హమీద్ వినియోగదారుల మండలి కోశాధికారి సంఘ రంజిత్ మండలి సభ్యులు పాల్గొన్నారు.