సొంతపనులపై విదేశాలకు వెళుతూ ప్రభుత్వ ఖర్చులో రాసే అలవాటు ఉన్న నాయకులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పనులపై సొంత డబ్బుతో అమెరికా వెళ్లారు. తన కుమార్తె వర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అమెరికా వెళ్లిన వై ఎస్ జగన్ అమెరికాలో అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. అయితే మూడు రోజుల పాటు సొంత పనులపైనే ఉంటున్నందున ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లు తీసుకోవడం లేదు. ఈ నెల 22వ తేదీ వరకూ ఆయన అమెరికాలో పర్యటిస్తారు. 16న వాషింగ్టన్ డీసీ, 17న డల్లాస్, 18,19 తేదీల్లో వాషింగ్టన్ డి సి, 21, 22 తేదీల్లో షికాగోలో ఆయన పర్యటించనున్నారు. ఆ తర్వాత 22న తిరిగి రాష్ట్రానికి వస్తారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, దౌత్యాధికారులతో చర్చిస్తారు. 16న ఉదయం 8:30 గంటలకు (IST 6PM) వాషింగ్టన్ డి సి చేరి అక్కడ అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. సాయంత్రం అమెరికాలో భారత్ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గోంటారు. 17 మధ్యాహ్నం 2గంటలకు (IST అర్థరాత్రి 12:30AM) డల్లాస్ చేరుకుంటారు. డల్లాస్ లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకూ నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీని కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై సీఎం వుంటారు. 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు.