కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు. న్యూఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రబలంగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. దేశంలో కరోనా కేసులలో మూడోస్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందని ఇది ఎంతో బాధాకరమైన పరిస్థితి అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజెన్ కొరత
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, వెంటలేటర్ సౌకర్యం ఉన్న ఆసుపత్రులు బాగా తక్కువ అని ఆయన అన్నారు. ప్రాణాధార మందులు కూడా తగినంత స్టాక్ లేదని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ‘‘ఒక వ్యక్తిని చెత్త వ్యాన్లో COVID19 కేంద్రానికి తీసుకెళ్లడాన్ని తెలుసుకుని నేను సిగ్గుతో తల దించుకున్నాను’’ అని ఆయన ఎంతో ఆవేదనగా చెప్పారు.
‘‘ మా సీఎం వైఎస్ జగన్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? దానికి చింతిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని వైద్య పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలని ఆయన కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించాలని కోరారు.
ఘోరమైన వైరస్ ను నియంత్రించడంలో నా ఆలోచనలు, నా వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లాగా ఢిల్లీ ఒక మోడల్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించాలని సూచించారు.