39.2 C
Hyderabad
April 25, 2024 17: 53 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

అన్యమత సిబ్బందికి ఉద్వాసన తప్పదు

Tirupati

దేవాలయాల్లో అన్యమతస్థులు పని చేయడంపై వస్తున్న అభ్యంతరాలకు చెక్ పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నది. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు కానీ దేవస్థానాలలో అన్యమతస్థుల ప్రమేయంపై  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం,  ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్ గా మారింది. తిరుపతి, శ్రీశైలం లాంటి  వివిధ ప్రముఖ దేవాలయాలలో ముస్లింలు, క్రిష్టియన్లు పని చేస్తున్నారని సోషల్ మీడియాలో మెసేజ్ లు పంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి.

తిరుమల ఆర్టీసీ బస్సుల్లో జరూసలేం యాత్ర ప్రకటనలతో టిక్కెట్టు జారీ చేయడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టకు తీరని భంగం కలిగింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిష్టియన్ కాబట్టి ఇలా జరుగుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. అంతే కాకుండా ఆయన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన విషయాలను కూడా పనిలో పనిగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తిరుమల కొండ పై అప్పటిలో జరిగిన అన్యమత ప్రచారం పై ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునో ఏమో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం తక్షణ చర్యలకు ఉపక్రమించినట్లుగా కనిపిస్తున్నది. ముందుగా తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలలో పని చేస్తున్న ఇతర మతాల వ్యక్తులకు ఉద్వాసన చెప్పే విధంగా ఏపి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు. ఎందుకంటే వారిలో చాలా మంది పర్మినెంటు ఉద్యోగులు ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం హయంలో నియమితులైన వారు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్నవారు ఉన్నారు. అంతే కాదు కొన్ని సేవలను అవుట్ సోర్సింగ్ కు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ తీసుకున్న కాంట్రాక్టర్లు అన్యమతస్థులను వినియోగిస్తున్నసందర్భాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి చర్యలను సరిదిద్దడం అంత సులభమైన పనినేం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ అంశాన్ని ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీ ఉద్యమాలకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే పలు చోట్ల ఉద్యమాలు ఊపందుకున్నాయి. తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలకు సంబంధించిన ఉద్యమాలు తీవ్రంగా ఉన్నాయి. అలాగే ఇది అన్ని దేవస్థానాలకు విస్తరిస్తున్నది కూడా. అందుకోసమే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలలో భాగంగా రెండు రోజుల కిందట తిరుమల పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అక్కడ జరిగిన అధికారిక సమావేశంలో అత్యంత కఠినమైన నిర్ణయాన్ని వెల్లడించారు.

దేవస్థానాలలో పని చేసే ఉద్యోగులు విధిగా దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎవరో వీడియో తీసి బయటకు పంపడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దేవస్థానాలలో పని చేస్తూ తమకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పేవారు దేవస్థానాలు వదిలి వెళ్లాలని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. తిరుమల దేవస్థానాలలో పని చేసే అన్యమస్థులు తమంతట తాముగా తప్పుకుంటే మంచిదని ఆయన అన్నారు. అలాకాని పక్షంలో ఏరివేత జరుగుతుందని ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

మతం అనేది ప్రయివేటు వ్యవహారమని, ఎవరికి ఇష్టం వచ్చిన మతం వారు అనుసరించవచ్చునని అయితే తిరుమల దేవస్థానంలో పని చేస్తూ తమకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదంటే మాత్రం కుదరని ఆయన అన్నారు. స్వచ్ఛదంగా వైదొలగని అన్యమత సిబ్బంది ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లలో కూడా విధిగా వేంకటేశ్వర స్వామికి సంబంధినంచిన ఫొటోలే ఉండాలని కూడా ఆయన అన్నారు. అలా కాకుండా తిరుమల సిబ్బంది వేరే విధంగా ప్రవర్తిస్తే ఇక సహించేది లేదని ఆయన హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానంలో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. గతంలో అక్కడ పని చేసిన కార్యనిర్వహణాధికారి ముస్లింలతో సన్నిహిత సంబంధాలు నెరపి అక్కడ వారికి ఉద్యోగాలు ఇప్పించారు.

ఈ విషయం పై ఫిర్యాదులు వచ్చినా అప్పటిలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వారికి కూడా ఉద్వాసన పలికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు పని చేయడం తీవ్ర అభ్యంతరకరం. అందుకని సత్వర చర్యలు తీసుకోవడం అనివార్యం. కనీసం బిజెపి చేసే ఉద్యమాలకు భయపడి అయినా సత్వర చర్యలు తీసుకోవడం మంచిదే.

Related posts

మౌలిక సదుపాయాల అభివృద్ధికి అండగా ఉంటాం

Bhavani

మెగాస్టార్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Sub Editor

కొత్త తరానికి ఆదర్శం అంటే ఇలా ఉండాలి

Satyam NEWS

Leave a Comment