మాజీ ప్రధాని పి వి నరసింహారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని పదవిని అలంకరించిన తొలి తెలుగువాడైన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
తెలంగాణలో పుట్టినా ప్రపంచ దేశాలలో పేరు సంపాదించుకున్న మేధావి పి వి నరసింహారావు. అంతే కాకుండా ఆయన ప్రధాని పదవిలో కొనసాగింది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడుగా. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పి వి నరసింహారావు పార్లమెంటు సభ్యుడుగా నంద్యాల నుంచి పోటీ చేసి అప్పటి వరకూ లోక్ సభ ఎన్నికలలో ఉన్న మెజారిటీ రికార్డును తిరగరాశారు. ప్రధాని పదవిని చేపట్టే నాటికి ఆయన లోక్ సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. అందువల్ల ఆయన 1991 లో జరిగిన ఉప ఎన్నికలలో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. దాదాపుగా ఐదు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు.
1991 సాధారణ ఎన్నికలలో నంద్యాల స్థానం నుంచి గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించారు. పి వి కోసం ఆయన తన సీటును త్యాగం చేశారు. గంగుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో పివి పోటీ చేసి రికార్డు మెజారిటీ తెచ్చుకుని ప్రధానిగా కొనసాగారు.
ఆ తర్వాత 1996 లో జరిగిన సాధారణ ఎన్నికలలో కూడా పీ వీ నరసింహారావు నంద్యాల పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన ఒడిసా లోని బరహన్ పూర్ నియోజకవర్గం నుంచి కూడా గెలిచినందున ఆయన ఆ స్థానాన్ని ఉంచుకుని నంద్యాలను వదిలేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసి ఆ తర్వాత దేశ ప్రధాని అయిన పి వి నరసింహారావును స్మరించుకోవాల్సిన అవసరం లేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పి వి నరసింహారావు ను స్మరించుకోవడమే కాకుండా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ఆయన పేరును కూడా తలవడం లేదు. ఇది తెలుగు ప్రజలకు తీరని లోటని మేధావులు భావిస్తున్నారు.