తిరుమల శ్రీవారి ఆన్ లైన్ సేవా టికెట్లను మరి కొద్దిరోజుల పాటు నిలుపుదల చేయడం, తిరుపతిలో మద్యం దుకాణాలను రెండు నెలలపాటు పూర్తిగా మూసివేయడం ఈ రెండు నిర్ణయాలు తీసుకోకుండా తిరుమలలో కరోనా నియంత్రణ చేయలేరని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుపతి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తిరుపతి వస్త్ర వ్యాపారస్తుల సంఘం, చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నగరంలో అన్ని వ్యాపార వర్గాలు కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం నిర్వహించుకోవాలని నిర్ణయించి అమలు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
తిరుమల,తిరుపతిలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి అని శ్రీవారి భక్తునిగా స్థానికుడుగా టీటీడీ అధికారులను లాక్ డౌన్ ముందు హెచ్చరిస్తే తనపై కేసు పెట్టారని ఆయన అన్నారు. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కూడా విమర్శించారని మరి ఈరోజు పరిస్థితులకు బాధ్యులు ఎవరు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన కోరారు.
ఢిల్లీ తరహా కేసులు పెట్టాలంటే ఎవరు బాధ్యులు?
ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన కారణంగా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందిందని దానికి బాధ్యులైన వారిపై కేంద్రం ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదుచేసి వారి పాస్ పోర్ట్ లను సీజ్ చేసింది మరి తిరుపతిలో పెరుగుతున్న కేసులకు ఎవరు బాధ్యులు?
బాధ్యులైన వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ తరహా కేసులు నమోదు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జిల్లా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే సీఎం జగన్ తో చర్చించి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మద్యం షాపులను రెండు నెలలపాటు మూసివేయించేలా చొరవ చూపాలని ఆయన కోరారు.
తిరుపతి ప్రజల ఆరోగ్య భద్రత పై అహర్నిశలు శ్రమిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష వారి సిబ్బంది అలాగే జిల్లా ఎస్ పి రమేష్ రెడ్డి వారి సిబ్బందికి నగర ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఆయన చెప్పారు. టిటిడి ఉన్నతాధికారులు భేషజాలకు పోకుండా వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ,నగరపాలక సంస్థ జిల్లా ఎస్పీ తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తిరుమల తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు.