ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తింది. తెలంగాణలో అధికార పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పూర్తిగా బహిష్కరించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ఇటీవలి కాలం వరకూ ఎంతో సఖ్యతగా కలిసి పని చేశాయి. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు గత ఎన్నికల సమయంలో ఇచ్చుపుచ్చుకునే ధోరణలో ఉండేవి.
ఇటు కేసీఆర్, అటు జగన్ లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటిది బీజేపీ విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తించడం ఆసక్తి కలిగిస్తున్నది. ప్రధాని మోదీ పర్యటనను పూర్తిగా తమ భుస్కంధాలపై వేసుకున్న వైసీపీ ఆయన పర్యటనను విజయవంతం చేసింది. ప్రధాని పర్యటనను ఏపి బిజెపి కన్నా ముందే తెలుసుకున్న వైసీపీ అక్కడి బిజెపి నాయకులకు కూడా తెలియకుండా సమీక్షలు నిర్వహించారు.
అధికారిక సమీక్షలకు బిజెపి నాయకులకు కనీసం పిలవను కూడా లేదు. ప్రధాని తమకే చెప్పి వస్తున్నారనే చందంగా అక్కడి వైసీపీ నేతలు వ్యవహరించారు. తమ నాయకుడే వస్తున్న విధంగా వారు జన సమీకరణ చేశారు. అదే సమయంలో తెలంగాణ లో ప్రధాని మోదీ గో బ్యాక్ బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ నాయకుడు వెళ్లడం లేదు.
ఏపి ముఖ్యమంత్రి సార్ సార్ అంటూ మోదీని పదే పదే నెత్తిన పెట్టుకోగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా వెళ్లలేదు. స్వాగతం పలకడం సంగతి అటుంచి ప్రధాని కార్యక్రమంలో టీఆర్ఎస్ మూడో శ్రేణి నేతలు కూడా పాల్గొనలేదు. ఇది దేశ ప్రధానికి తీరని అవమానంగా చెప్పవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలోని వామపక్షాలు మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించాయి.
తెలంగాణ లో అయితే వామపక్ష నాయకుల నిరసనలు అణచి వేయడానికి పోలీసులు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. నరేంద్రమోదీకి తెలంగాణ సమాజం నుంచి ఇంత వ్యతిరేకత రావడం ఆసక్తికరంగా మారింది.