ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు స్థానచలనం కలగబోతున్నదా? ఈ మేరకు పలు రకాల ఊహాగానాలు ఉన్నాయి.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర ప్రభుత్వంతోనూ, న్యాయ శాఖ తోనూ సంప్రదించకుండానే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొత్త చిక్కులు వస్తున్నాయని ఇప్పటికే పలువురు బిజెపి నాయకులు ఫిర్యాదులు చేశారు. బిజెపి ఫిర్యాదులే కాకుండా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను అక్కడ నుంచి కదిలించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏపీకి కొత్త గవర్నర్ వస్తారని.. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ని తప్పించబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొద్ది రోజుల క్రితం తమను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాల పై అసంతృప్తిగా ఉన్న కేంద్రం ఆయనను మార్చేందుకు రంగం సిద్దం చేసిందని లేటెస్ట్ టాక్.
మరీ ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం నుంచి నియామకం వరకూ జరిగిన అంశాలు, మూడు రాజధానుల బిల్లుల ఆమోదం వంటి అంశాలపై కేంద్రాన్ని సంప్రదించకుండా గవర్నర్ వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో ఎదగాలన్న పార్టీ ఆశయానికి గండి పడిందని బిజెపి నాయకులు అంటున్నారు.
అంతేకాక ఈ నిర్ణయాలు అటు కేంద్రాన్ని కూడా ఇరుకున పెట్టాయని అందుకే ఆయనను తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా వినికిడి. అయన స్థానంలో వచ్చే కొత్త గవర్నర్ సెలెక్షన్ కూడా ఇప్పటికే అయిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీనీ నియమిస్తే అటు సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్ళెం వేయవచ్చునని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.