రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నీలం సాహ్నీ తీసుకున్ననిర్ణయాలు చాలా వరకూ వివాదాస్పదం అయ్యాయి. కోర్టుల వరకూ చేరాయి. కోర్టులు కూడా పిలిచి మరీ సంజాయిషీ అడిగాయి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులు అయిన తర్వాత కూడా నీలం సాహ్నీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు.
ఏపీ లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం తాజా పరిణామం. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని హైకోర్టు ఆక్షేపణ వెలిబుచ్చింది. సాధారణంగా న్యాయస్థానాలు ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోవు.
అయినా సరే రాష్ట్ర హైకోర్టు స్పందించిందంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచికి అప్పీలుకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అయితే జరిగిన పరిణామాలను ఒక్క సారిగా చూసి ముందుకు వెళితే బాగుంటుంది. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త కాదు. ఎన్నో తీర్పులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి.
అయితే తాము తీసుకున్న నిర్ణయాలపై కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోని కొందరు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడారే తప్ప ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించుకోలేదు. ఇప్పుడు ఆదరాబాదరా నిర్ణయాలు తీసుకునే కోవలోకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా వచ్చేసింది. జెడ్ పి టిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహించేందుకు అప్పటి ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విముఖత చూపించారు.
దానికి న్యాయపరమైన అడ్డంకులు వస్తాయని డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ముందుగానే తెలుసు. అందుకనే ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలంలో చివరి రోజు వరకూ కూడా నిప్పులు చెరగుతూనే వచ్చారు తప్ప, ఆయన చెప్పింది అర్ధం చేసుకోలేదు.
ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారు పదవిలో ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్నారు. తమకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకుంటున్నారు. అలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నీ తీసుకున్న తొలి నిర్ణయమే కోర్టులో వీగిపోయింది.
డివిజన్ బెంచ్ కి అప్పీలుకు వెళ్లవచ్చు … అక్కడ ఏ నిర్ణయం అయినా వెలువడవచ్చు. అయితే ఎన్నికల కమిషనర్ తీసుకున్న తొలి నిర్ణయమే న్యాయవ్యవస్థ స్క్రటినీలో నిలబడలేదు అనేది మాత్రం వాస్తవంగా ఎప్పటికి నిలబడి పోతుంది.
అందువల్ల రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ప్రభుత్వ పెద్దల మనోభిష్టానికి అనుకూలంగా కాకుండా చట్టబద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఆ వ్యవస్థలకు పవిత్రత వస్తుంది.