దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ చర్య వల్ల తనకు మానసికంగా వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై మిత్రులు, బంధువులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
ప్రభుత్వం చేసిన ఈ చర్యపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు. అక్రమాలు చేసిన కారణం గా తనపై చర్య తీసుకున్నారు అనేది అవాస్తవమని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తన తదుపరి ఏమిటి అన్నది క్రమం గా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇజ్రాయెల్కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది. వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన సంస్థ ద్వారా అత్యంత కీలకమైన నిఘా పరికరాలను, వ్యవస్థలను కొనుగోలు చేశారని మరో నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది.
ఆయన కుమారుడి సంస్థ నుంచే పోలీసులు వినియోగించే కీలకమైన నిఘా పరికరాలను కొనుగోలు చేయించటం అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులు వినియోగించే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ ఉపకరణాలను ప్రైవేటు వ్యక్తులు, విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ చేతుల్లో పెట్టటం ద్వారా… జాతీయ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించారని ప్రభుత్వం తన నివేదికలో వివరించింది.
నిఘా, భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తదితర సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా అవేమీ పాటించలేదని స్పష్టం చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించినందుకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల 7న డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి వచ్చిన లేఖను అనుసరించి వెంకటేశ్వరరావుపై తక్షణం సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు తెలిపారు. తదుపరి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.