Slider సంపాదకీయం

ఫైనల్ స్టేజ్‌కి జగన్ లిక్కర్ స్కామ్‌

#liquor

గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్‌ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని అడ్డూ అదుపు లేకుండా అరాచకాలకు తెర తీశారు. అధికారం చేతిలో పెట్టుకుని అటు అధికారులను, కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తలను, ప్రజా ప్రతినిధులను బెదిరించి మరీ తమ దారిలోకి వచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు వారంతా లిక్కర్ స్కామ్‌లో కూరుకుపోయారు. విచారణకు ఎలా డుమ్మా కొట్టాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరు జగన్‌ హయాంలో సూపర్ బాస్‌గా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి కాగా..మరొకరు జగన్‌ వెంటే ఉండి ఆయన సొంత వ్యవహారాలు చూసిన OSD కృష్ణమోహన్ రెడ్డి.

ఆయనే బాస్‌

ధనుంజయ రెడ్డి నిజానికి IAS కాదు. ఢిల్లీ, అండమాన్‌ నికోబార్ దీవుల సర్వీసుకు చెందిన ధనుంజయ్ రెడ్డిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఏపీకి డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. కడప జిల్లాకు చెందిన ధనుంజయ రెడ్డి వైఎస్‌ కోటరీలో కీలక అధికారిగా మారారు. ఆ తర్వాత ఆయనను IASకు ఎంపిక చేయించారు. ఏపీలోనే పోస్టింగ్ ఇప్పించారు. జగన్‌ అధికారంలోకి రాగానే ధనుంజయ రెడ్డిని సీఎం పేషీలోకి తీసుకున్నారు. సీఎం సెక్రటరీగా నియమించారు. పేరుకే సీఎం కార్యదర్శి కానీ పెత్తనమంతా ఆయనదే అన్నట్లుగా ధనుంజయ రెడ్డి హవా సాగింది. జగన్‌తో ఉన్న సానిహిత్యంతో అధికారమంతా తన గుప్పిట పెట్టుకున్నారు.

ఇక జగన్‌కు OSDగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి మొదట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్‌కు పీఏగా పని చేశారు. గతంలో ఆయన సర్పంచ్‌గానూ పని చేశారు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణమోహన్‌రెడ్డి హోదా PA నుంచి OSDగా మారింది.

సెటిల్‌మెంట్స్‌ అన్ని అక్కడే

జగన్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్లన్నీ ఈ ఇద్దరి ద్వారానే జరిగాయని ప్రచారం జరిగింది. జగన్‌ పేరిట కొన్ని, ఆయన పేరుచెప్పి చేసేవి కొన్ని అన్నట్లుగా ధనుంజయ్‌రెడ్డి వ్యవహారాలు ఉన్నాయని అప్పట్లో బహిరంగ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఎంతటి పెద్ద పారిశ్రామికవేత్త అయినా, ఎంతపెద్ద నేత అయినప్పటికీ ధనుంజయ్‌రెడ్డి కాళ్లచుట్టూ తిరగాల్సిందే. ఆయన దర్శనం కూడా అంత సులువుగా దొరికేది కాదని చెబుతుంటారు. ధనుంజయ్‌రెడ్డి ఏది ఆదేశిస్తే అది జరిగిపోవాల్సిందే అన్నట్లుగా అధికారయంత్రాంగాన్ని నడిపించారు. ఆయన బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. పదవిపోయాక ఆయన గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక్కసారిగా మద్యం స్కామ్‌లో ఈ మాజీ సూపర్‌బాస్‌ పేరు తెరపైకి వచ్చింది. జగన్‌ హయాంలో జరిగిన లిక్కర్‌ కుంభకోణంలో రూ.వేల కోట్లను అప్పటి పాలకులు సొంత ఖాతాల్లో వేసుకున్నారన్న ఆరోపణలపై CID జరుపుతున్న విచారణలో ఒక్కరొక్కరి పేరు బయటకొస్తుంది.

ఆదేశాలు ఎవరివి?

లిక్కర్‌ స్కామ్‌లో ప్రధానంగా సొంత బ్రాండ్లను తయారు చేయించడం, రాష్ట్రంలోని ప్రముఖ డిస్టిలరీలను బెదిరించి లాక్కోవడం కీలకమైన అంశాలు. ఇందులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిల పాత్ర ఏ మేరకు ఉంది? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం ముడుపుల వ్యూహం ఖరారు, ఇతర కీలక సమావేశాల్లో తమతోపాటు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమెహన్‌రెడ్డి పాల్గొన్నారని ఈ కేసులో A-1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డితోపాటు పలువురు నిందితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ముడుపుల దందాను ఖరారు చేసే సమావేశాల్లో పాల్గొనాలని, ఆ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహ న్‌రెడ్డిలను ఎవరు ఆదేశించారో తేలాల్సి ఉంది. అది తేలకుండా లిక్కర్‌స్కామ్‌ దర్యాప్తు ముగిసినట్లు కాదు. దీంతో వీరిద్దరి వాంగ్మూలాలను నమోదుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

అయితే, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు సాధారణ వ్యక్తులుగా విచారణకు హాజరుకావడానికి ఆ ఇద్దరికి అహం అడ్డొస్తున్నట్లుంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పాల్సి వస్తే, ఈ వ్యవహారంలో జగన్‌ పాత్ర కూడా నిర్ధారణ అవుతుంది. అదే జరిగితే తమకు మరిన్ని చిక్కులు తప్పవని ఆ ఇద్దరు భావిస్తున్నారు. దీంతో విచారణను ఎలా ఎగ్గొట్టాలా అని పథక రచన చేస్తున్నారని తెలిసింది. సుప్రీం కోర్టులో వీరికి ఎలాంటి వెసులుబాటు రానందున దర్యాప్తు సంస్థ వీరిని తక్షణ విచారణకు పిలిస్తే తప్ప ఈ కేసులో అసలు నిజాలేమిటో బయటకు రావని పోలీసువర్గాలే చెబుతున్నాయి.

బిగ్‌ షాక్‌

లిక్కర్‌ స్కామ్‌లో తమ పేర్లు బయటకొచ్చాయని తెలియగానే ఆ ఇద్దరిలో వణుకు మొదలయింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే ఆగమేఘాల మీద సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అక్కడ కాదు పొమ్మనడంతో షాక్‌కు గురయ్యారు. హైకోర్టు ఏం చెబుతుందోనని తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వీరిద్దరికి లిక్కర్‌స్కామ్‌తోనే సంబంధాలున్నాయా? అంతవరకే వీరి పాత్ర పరిమితమైందా? అని ఆరాతీస్తే ఒక్కసారి వారి గత వైభవాన్ని పరిశీలిస్తే అసలు విషయాలు ఎన్నో బయటకొస్తాయి. జగన్‌ హయాంలో జరిగిన ఏ స్కామ్‌ను గురించి విచారించాలన్నా ఈ ఇద్దరే కీలకం అని పోలీసు అధికారులు భావిస్తున్నారు.  ఈ ఇద్దరి ఆదేశం లేకుండా జగన్‌ ప్రభుత్వంలో ఏదీ జరగలేదన్నది పోలీసుల అభిప్రాయం. అనేక స్కామ్‌లతో ముడిపడిన ధనుంజయ్‌రెడ్డిని విచారించడానికి సిట్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఇద్దరిదే కీ రోల్ –

లిక్కర్‌స్కామ్‌లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ల విచారణ తర్వాత అనేక మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల వ్యవహారం ప్రస్తుతం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల దగ్గర ఆగింది. ధనుంజయ్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే తాము పనిచేశామని మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టైయిన అనేక మంది వెల్లడించారు. నిజానికి ధనుంజయ్‌రెడ్డి పేరు చెప్పారంటే…దాన్ని జగన్‌ పేరు చెప్పడంగానే చూడాల్సి ఉంటుందని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. జగన్‌ చెబితేనే మద్యం ముడుపుల ఆదేశాలు ఇచ్చి ఉంటారని ఈ వర్గాలు సందేహిస్తున్నాయి. కాబట్టి ఈ జగన్‌ పాత్ర నిరూపించేందుకు ఈ ఇద్దరే కీలకం.

Related posts

యువ హీరో శ్రీ సింహా ‘భాగ్ సాలే’ చిత్రం ‘కూత రాంప్’ పాట విడుదల

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: బోసిపోయిన అంతర్జాతీయ విమాన ప్రదర్శన

Satyam NEWS

పరిసరాలకు ఇబ్బంది లేకుండా భవనం కూల్చివేత

mamatha
error: Content is protected !!