ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న ఆయన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తున్నది.
పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాథ్ దాస్ ఇప్పుడు రాష్ట్ర ఐఏఎస్ అధికారుల చీఫ్ గా రానున్నారు. ఎంతో సమర్ధుడైన అధికారిగా ఆదిత్యానాథ్ దాస్ పేరు పొందారు.
1988 నుంచి ఏడాది పాటు విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేయడంతో తన సర్వీస్ ను ప్రారంభించిన ఆదిత్యానాథ్ దాస్ ఆ తర్వాత నంద్యాల, విజయవాడ లలో కూడా అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. తర్వాత ఆయన నెల్లూరు డిఆర్ డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేశారు.
జీహెచ్ఎంసి లో అదనపు కమిషనర్ గా పని చేసిన అనంతరం 1995లో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆదిత్యానాథ్ దాస్ నియమితులయ్యారు. తర్వాత తొలి సారిగా వరంగల్ జిల్లా కలెక్టర్ గా 1999లో నియమితులయ్యారు. 2007 లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఎన్నికల పరిశీలకుడిగా ప్రత్యేకంగా ఆయన పని చేశారు.
అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆయన కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన కాలంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. నీటిపారుదల అంశాలలో ప్రావీణ్యత ఉన్న ఆదిత్యానాథ్ దాస్ జలవనరుల శాఖ కార్యదర్శిగా పని చేశారు.
ఆ తర్వాత విద్యాశాఖలో కూడా ఆయన పని చేశారు. ప్రత్యేక కార్యదర్శిగా జలవనరుల శాఖలో ఆయన సేవలు చాలా కాలం పాటు అందించారు. ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలలో సేవలు అందిస్తున్నారు.