ఏపీ సాఫ్ట్బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అత్యున్నత ప్రతిభ చాటాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి జెడ్పీ హై స్కూల్లో మూడు రోజులపాటు జరిగిన అంతర్ జిల్లాల బాల, బాలికల జూనియర్ సాఫ్ట్బాల్ టోర్నమెంటు ఆదివారం ముగిసింది. హోరాహోరీగా జరిగిన పోటీల్లో విజయనగరం బాలుర జట్టు మొదటి స్థానం సాధించగా అనంతపురం జిల్లా బాలబాలికల చక్కటి ప్రతిభ కనబరచి బాలుర జట్టు ద్వితీయ స్థానం, బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది.
బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఏపీ సాఫ్ట్ బాల్ సీఈఓ సి.వెంకటేసులు, అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సి. నాగేంద్ర, టోర్నమెంట్ ఆర్గనైజర్ రవీంద్రరాజు, కడప సాఫ్టుబాల్ సీఈఓ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తాను కూడా విద్యార్థి దశలో సాఫ్ట్బాల్ క్రీడను ఆడే వాడినని ఆ తర్వాత ఈ క్రీడకు ప్రాచుర్యం తగ్గిందన్నారు. మరలా ఇప్పుడు ఈ క్రీడ ఆదరణకు నోచుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.
వైసీపీ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందని, విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందించి క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులుగా తయారయ్యేందుకు దోహదపడుతోందన్నారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో క్రీడా స్ఫూర్తితో ఆడి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీలు జగదీశ్వరయ్య, ప్రభాకర్, గోపాల్ రెడ్డి, లతాదేవి, చంద్ర, కోచ్ లు మహేష్, శివ, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.