ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్గా నియమితులు కానున్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. షెల్లీ ఒబెరాయ్(39) గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి నెగ్గారు. ఇండియన్ కామర్స్ అసోషియేషన్లో లైఫ్టైం మెంబర్గా ఉన్నారు. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్ను అందుకున్నారు. పలు దేశీయ, అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.
ఎన్నికల్లో మూడుసార్లు విఫలయత్నాల తర్వాత, సుప్రీంకోర్టులో ఆప్కి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత బుధవారం మేయర్ ఎన్నిక ఓటింగ్ జరిగింది. డిసెంబరులో ఎన్నికలు జరిగినప్పటి నుండి, ఆప్, బీజేపీల మధ్య సుదీర్ఘ వాగ్వాదాల మధ్య మేయర్ ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలన్న బీజేపీ వాదనను సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో ఓటు వేయరాదని చెప్పారు. “నామినేటెడ్ సభ్యులు ఎన్నికలకు వెళ్లలేరు. రాజ్యాంగ నిబంధన చాలా స్పష్టంగా ఉంది” అని కోర్టు పేర్కొంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. స్టాండింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఆప్కి మూడు, బీజేపీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆరో సీటుపై పోరు నెలకొంది.