కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అమలులో భాగమే ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇంటి నుంచి ప్రజలెవ్వరు బయటకు రాకుండా ఉంటే వైరస్ లింక్ తెగిపోతుందన్నదని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్ డౌన్ ను మరింతగా కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు.
అందులో భాగంగా నే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఆహార యాప్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి నిత్యవసర సరుకులు, కూరగాయలు అందించేందుకు గాను జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ రూపకర్త మహ్మద్ సభిని మంత్రి అభినందించి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. సిద్ధిపేటలో ప్రయోగాత్మకంగా రూపొందించి అమలు పరచిన ఈ యాప్ అమలులో విజయవంతమై జిల్లా వ్యాప్తంగా అమలులోకి తేవాలని సమీక్షలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు.