ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు కూడా పెరగబోతున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమతి ఇవ్వగానే చార్జీలు భారీ ఎత్తున పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు పేరుకుపోయిన నష్టాలు రూ.6735 కోట్ల కు చేరుకుందని అందువల్ల చార్జీలు పెంచక తప్పడం లేదని ఆయన అన్నారు. వివిధ అప్పుల కింద 2995 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. 2015 లో డీజిల్ ధర 50 ఉంటే నేడు 75 కు చేరిందని ఆయన అన్నారు.
అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి భారంగా మారాయని ఆయన తెలిపారు. దాంతో ఆర్టీసీకి ఏటా నికర నష్టం 12 వందల కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెల 100 కోట్లు అప్పు పెరుగుతోందని, ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయని ఆయన అన్నారు.