రిపబ్లిక్ టివి పై పగబట్టిన మహారాష్ట్ర పోలీసులు పాత కేసును తిరగదోడి అర్నబ్ గోస్వామిని అత్యంత దారుణంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన తీరు పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. 2018లో జరిగిన కేసుకు సంబంధించి అర్నబ్ గోస్వామిని ఇప్పుడు అరెస్టు చేశారు.
అన్వాయ్ నాయక్ అనే ఆర్కిటెక్టు 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతో బాటు ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నరు. రిపబ్లిక్ టివి మరో రెండు సంస్థలు తనకు రావాల్సిన బకాయిలు ఇవ్వనందునే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అన్వాయ్ నాయక్ అప్పటిలో రాసిన లేఖలో పేర్కొన్నాడు.
దీనికి సంబంధించి తాము అన్ని బకాయిలు చెల్లించామని రిపబ్లిక్ టివి యాజమాన్యం ఇంతకు ముందే ప్రకటించింది. అర్నబ్ గోస్వామికి మహారాష్ట్ర పోలీసులకు మధ్య యుద్ధం ప్రారంభం అయిన తర్వాత కథ రోజుకో మలుపు తిరుగుతున్నది.
నాయక్ కుమార్తె తన తండ్రి మరణానికి కారణం అయిన వారిని ఇప్పటి వరకూ శిక్షించలేదని అలీబాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ కేసును రీ ఓపెన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేశారని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అర్నబ్ గోస్వామి తనపై పోలీసులు దాడి చేశారని, తనను గాయపరిచారని మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. దాంతో మేజిస్ట్రేట్ వైద్య పరీక్షల నిమిత్తం అర్నబ్ ను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.