రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీటీడీ చైర్మన్,ఈవో లకు ఆదేశాలిచ్చి యుద్ధ ప్రాతిపదికన 5 క్వారంటైన్ సెంటర్లను ఏర్పాట్లు చేసి కరోనా వైరస్ బాధితులను ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాయలసీమకే తలమానికంగా ప్రతి పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో తిరుపతిలో నిర్మించిన స్విమ్స్,రుయా ఆస్పత్రిలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా బెడ్లతో పాటు ఆక్సిజన్ వెంటిలేటర్ల కొరత ఏర్పడుతున్నదని ఆయన అన్నారు.
చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి సైతం కరోనా వైరస్ బాధితులు స్విమ్స్ రుయా ఆస్పత్రిలకు రావడంతో తిరుపతిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్ల కొరత ఏర్పడుతున్నదని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యల్లో భాగంగా బాధితుల సౌకర్యార్ధం టీటీడీ చైర్మన్ ఐఏఎస్ అధికారులతో చర్చించి టీటీడీ విద్యాసంస్థలలో హాస్టల్స్ లో కరోనా వైరస్ బాధితుల సౌకర్యార్థం పడకలు ఏర్పాటుచేసి వైద్యుల పర్యవేక్షణలో ప్రాణవాయువు(OXYGEN) కల్పించినట్లయితే ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ప్రాణదానం చేసిన వారవుతారని ఆయన అన్నారు.
తిరుచానూరు వద్ద గల పద్మావతి నిలయం ను కరోనా వైరస్ బాధితుల సౌకర్యార్థం వినియోగిస్తూ వైద్యుల పర్యవేక్షణలో పౌష్టిక ఆహారం ఇచ్చి ఎంతోమందిని ఆదుకుంటున్నారు! “మానవ సేవే మాధవ సేవ” అన్న నినాదంతో తిరుపతి లో మరో 5 సెంటర్లను రాష్ట్రప్రభుత్వం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసి కరోనా వైరస్ బాధితులకు అండగా నిలవాలని ఆయన కోరారు.