ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
బుధవారం ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి, టీటీడీ జెఈఓ పి. బసంత్ కుమార్, ఏ వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మీడియా తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు, కళ్యాణోత్సవానికి లక్ష మంది పైగా భక్తులు వస్తారని అన్నారు.
ఏప్రిల్ 7 వ తేదీ న జరిగే కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవానికి హాజరు అయ్యే అవకాశం ఉందన్నారు.
స్వామి వారి కళ్యాణోత్సవాలు గత 3 సంవత్సరముల నుండి జరుపుకొంటున్నామని ఏ ఏటికి ఆ ఏడు అభివృద్ధి పనులను మెరుగ్గా చేస్తున్నామన్నారు. గతంలో తాత్కాలిక షెడ్లు వల్ల భక్తులకు ఇబ్బంది కలిగిందని ఆ ఇబ్బంది పునరావృతం కాకుండా పర్మినెంట్ షెడ్లను ఏర్పాటు చేశామన్నారు.
శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవానికి 60 లేక 70 వేలమంది భక్తులకు సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని, అలాగే బయట ఆవరణలో కూడా భక్తులు ఉండేందుకు కార్పెట్స్, త్రాగునీరు, టాయిలెట్స్ తదితరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల కు అన్నప్రసాదాలు, తలంబ్రాలు ఇచ్చేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రముఖులకు ప్రత్యేక దారి, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ ఉత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వారం లేక పది రోజుల్లో జిల్లా అధికారులు, సీనియర్ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వాన పత్రికలు, అన్నప్రసాదాలు, పార్కింగ్, వాహనాల కదలికలు తదితర ఏర్పాట్లు పై కూలంకషంగా చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్డిఓ ధర్మ చంద్రారెడ్డి, తసీల్దార్ విజయ కుమారి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.