మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.
అదే విధంగా పి వి నరసింహారావు తైలవర్ణ చిత్రపటాన్ని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ ను కోరారు. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు భారత రత్నకు పూర్తిగా అర్హుడని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు.
నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారని సిఎం అన్నారు. భారత పూర్వప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి దేశచరిత్రలో ఒక విశిష్ట సందర్భం.
తెలంగాణా అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పి వి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను సంవత్సర కాలంపాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణా ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్ 28 వతేదీన పి వి జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది.
ఈ శతజయంతి ఉత్సవాల నిర్వహణ ద్వారా పి వి నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకునేలా చేయాలని తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తున్నది అని సిఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారత దేశం నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూల కారకుడు పివి నరసింహారావు.
దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణా ముద్దుబిడ్డడుగా చరిత్ర సృష్టించిన ఘనుడు పి. వి. నరసింహారావు. అందుకే ఇది పివి మన ఠీవి అని తెలంగాణా సగర్వంగా చాటుకుంటున్న సందర్భం అని ఆయన తెలిపారు.