ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశౄలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో పని దినాలను కుదించారు.
ఈ సెషన్లోనే 11 చట్టాల్లో సవరణలు, 3 ఆర్డినెన్స్ల బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడతాయేనని చూడాలి. అటు ప్రతిపక్షాలను అధికార పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే ఏపీ సీఎస్ నీలం సాహ్ని.. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్నిపునరాలోచన చేయాలని సూచించారు.