రైతులు ఉత్పత్తి చేసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఆఖరి గింజ వరకు కొనుగోళ్లు జరుగుతాయని, కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ మండలంలోని తోర్నాల గ్రామంలో శుక్రవారం సాయంత్రం వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు సంయమనం పాటించాలని కోరారు.
టోకెన్ల పద్ధతిలోనే కొనుగోలు జరగాలని, రైతులు ధాన్యాన్ని పరిశుభ్రం చేసి, తేమ శాతాన్ని పరిశీలించుకుని ధాన్యాన్ని తేవాలని తెలిపారు. ఈ మేరకు ఎండా కాలం దృష్ట్యా పొద్దున పూట ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్నామని, రాత్రి పూట కూడా కొనుగోళ్లు జరిగేలా కేంద్రంలో వీధి దీపాలు ఏర్పాటు చేయించాలని రైతులు మంత్రిని కోరారు. వెంటనే స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనుగోళ్లు జరిపేలా చర్యలు చేపట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయించి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.