అర్ధంతరంగా ఆగిపోయిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను లండన్ కు చెందిన ఆస్ట్రోజెనికా కంపెనీ పునరుద్ధరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కు అకస్మాత్తుగా అస్వస్థత చేకూరడంతో ఆస్ట్రోజెనికా మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేశారు.
అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం యునైటెడ్ కింగ్ డమ్ మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతించడంతో క్లినికల్ ట్రయల్స్ ను మళ్లీ పునరుద్ధరించారు. వ్యాక్సిన్ భద్రతకు ఢోకా లేదని అథారిటీ స్పష్టం చేసింది.
క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేయడానికి దారి తీసిన వైద్య సంబంధమైన సమాచారాన్ని బయటకు చెప్పేందుకు ఆస్ట్రోజెనికా సంస్థ నిరాకరించింది. సాధారణ పరిశీలన కారణంగానే క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ నెల 6వ తేదీన కంపెనీ క్లీనికల్ ట్రయల్స్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా ప్రమాదకర దశలో తాము ప్రపంచంలోని అన్ని దేశాల ఆరోగ్య సంస్థల నుంచి సమాచారం, సలహాలు తీసుకుంటున్నామని సురక్షితమైన వ్యాక్సిన్ ను లాభాపేక్ష లేకుండా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రకటించింది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఆస్ట్రోజెనికా 18 వేల మందికి వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా అందచేసింది.
ఇంత పెద్ద మొత్తంలో శాంపుల్స్ తీస్తున్నప్పుడు ఎవరో ఒకరికి అస్వస్థత కలగడం పెద్ద విషయంకాదని అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది.