కరోనా సోకగానే ఏం చేయాలి? ఐసోలేషన్ లోకి వెళ్లాలి లేదా క్వారంటైన్ ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ మందులు వాడాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. శ్వాస సంబంధిత ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా విచిత్రంగా కరోనా సోకిన వారిని స్మశానానికి తరలిస్తున్నారు.
చచ్చిన తర్వాత ఉంచాల్సిన చోట కరోనా రాగానే పెట్టేస్తున్నారు. దారుణమైన అమానవీయమైన ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో చోటు చేసుకుంది.
మానవత్వం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాల్సినంత ఘోరమైన తప్పిదం. క్రొవ్విడి గ్రామంలోని ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
దీంతో వారిని గ్రామంలో ఉండనివ్వకుండా స్మశానానికి తరలించాలంటూ కొందరు నాయకులు ఆరోగ్య శాఖ సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చారు. వారి ఒత్తిడితో ఆరోగ్య శాఖ సిబ్బంది ఇద్దరు మహిళలను శ్మశాన వాటికలో ఉంచారు.
నిన్న ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వారిద్దరిని స్మశానవాటికలోనే ఉంచారు. ఆహారం, తాగడానికి నీరు లేక బాధితులు విలవిలలాడారు.
ఈ అవమానం భరించలేక ఒక బాధితురాలు పక్కనే ఉన్న వెంకయ్య వయ్యేరు కాల్వలోకి దూకేందుకు రెండు సార్లు ప్రయత్నించగా బంధువులు అడ్డుకున్నారు. చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాధితులను తాడేపల్లిగూడెం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.
కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన అసలు మనం మనుషులమేనా అనే అనుమానం కలిగిస్తున్నది కదూ?