నాగరికతాపరంగా ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పగా చెప్పుకొంటున్నా…మహిళలపై నానాటికీ పెరుగుతున్న అమానవీయ సంఘటనలపై సభ్యసమాజం బాధ్యత ఏమిటన్నది ప్రస్తుత చర్చనీయాంశం. మొక్కుబడిగా మహిళా దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా పరిస్థితి మారకపోవడమే దురదృష్టకరం. స్త్రీలు పురుషులతో సమానంగా… నిష్పాక్షికంగా, నిజాయితీగా చెప్పాలంటే మగవారికంటే ఒకింత ఎక్కువగానే అన్ని రంగాలలోనూ అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని అనూహ్య విజయాలు సాధిస్తున్నారు.
మిగిలినవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువులలో బాలురకంటే బాలికలే ముందంజలో ఉంటున్నారు. ఉద్యోగావకాశాలలో స్త్రీల వాటా పెరుగుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో పాటు సకల శాఖలలో మహిళలు మగవారికి గట్టిపోటీ ఇస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆడవారిలో అక్షరాస్యతా శాతం పెరగడం మంచి పరిణామం. చదువు మధ్యలో ఆపినవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ఒక సాధారణ గృహిణిగా తన బాధ్యతను ఎంత సమర్ధవంతంగా నిర్వహించగలదో అంతే కార్యదక్షతతో మహిళ తాను చేపట్టిన పనిని నెరవేర్చగలదు. ఈ నేపథ్యంలో… మహిళకు దక్కాల్సిన రాజ్యాధికార వాటా కోసం పౌరసమాజం ఉద్యమించక తప్పదు. భారతదేశాజనాభాలో సగం సంఖ్యలో స్త్రీజాతి ఉన్నా ….ఇప్పటికీ రాజ్యాధికారం ‘ ఆమె’ కు అందనంత దూరంలోనే ఉండి …ఊరిస్తోంది.
పరిపాలనావ్యవస్థలో మహిళలకు సముచితస్థానం ఇవ్వాలన్న ఆలోచన రాజకీయులకు లేదన్నది తేటతెల్లం. కనీసం స్త్రీ జాతిపై నానాటికీ పెరుగుతున్న భౌతిక, మానసిక దాడుల్ని అరికట్టేందుకైనా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారా ? అంటే అదీ ప్రశ్నార్థకమే. అనునిత్యం స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు
ఏ స్థాయికి చేరుకున్నాయో తెలిస్తే గుండె బరువెక్కడం ఖాయం. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (2016-18)విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన కలిగించే అంశాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. 2017 లో మానభంగం / హత్యలకు బలైన స్త్రీల సంఖ్య 223 కాగా 2018 లో ఆ సంఖ్య 294 కి పెరిగింది. వరకట్నం చావులు 2017 లో 7466 కాగా 2018 లో 7166 గా నమోదయ్యాయి.
మహిళలను ఆత్మహత్యకు పురికొల్పిన సంఘటనలు 2017 లో 5282 కాగా 2018 లో 5037 గా గుర్తించారు. భర్త, కుటుంబ సభ్యుల వేధింపులకు గురైనవారి సంఖ్య 2017 లో 104551 కాగా 2018 లో 103272 కేసులు నమోదయ్యాయి. ఇక…యాసిడ్ దాడులు, బాలికలపై అత్యాచారాలు, స్త్రీల అక్రమరవాణా, పనిచేసే చోట్ల స్త్రీలపై దాడులు వంటి పలు కేసుల వివరాలను ఎన్ సీ ఆర్ బీ నివేదిక బహిర్గతం చేసింది. వాస్తవాలు ఇంత దారుణంగా ఉంటే ప్రజాక్షేమం కోసం అహర్నిశం పనిచేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయం.
పొలిమరశెట్టి కృష్ణారావు