ఆటో డ్రైవర్ ఒకడు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల డీఎస్పీ పి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గంభీరావుపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఈ దుర్ఘటన జరిగింది. 24 ఏళ్ల ఆటో డ్రైవర్ ఒకడు ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బస్సులో వెళ్లని రోజున ఆ ఆటో డ్రైవర్ ఆమెను ఆటోలో స్కూలుకి తీసుకెళుతుండేవాడు.
అలా ఆటోలో తీసుకెళ్తూ మాయమాటలు చెప్పి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినికి వాంతులు కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆ బాలిక గర్భవతి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయగా.. ఆ ఆటో డ్రైవర్ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడని తెలిపింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి వాడ్ని అరెస్ట్ చేశామని డీఎస్పీ పి.చంద్రశేఖర్ తెలిపారు.