తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత అమానవీయంగా జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లవరం మండలం కొమరగిరి పట్నం సముద్ర తీరంలో ఒక యువతి పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
అత్యాచారం చేయడమే కాకుండా నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో ఆ అమ్మాయి ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయింది. 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.
సముద్ర తీరంలో మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న ఆమె ఫొటోలను తీశారు. ఎవరికైనా చెబితే ఈ ఫొటోలు బయట పెడతామని బెదిరించారు.
దాంతో ఆ యువతికి ఏం చేయాలో తోచలేదు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. దాంతో ఆ అమ్మాయి తెగించి తన బంధువులకు చెప్పింది.
బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.