అక్రమ సంబందం నేపధ్యంలో విచక్షణారహితంగా వివాహిత పై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో కలకలం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా పందాలపాక గ్రామానికి చెందిన పండూరి సన్యాసిరావుకు, కొవ్వురు గ్రామానికి చెందిన గౌరీ దేవికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి ఇరువురికి ఇద్దరు సంతానం కలిగారు. పందాలపాకలో సంసారం సాగిస్తున్న వీరి జీవితంలో వీరి ఇంటి ప్రక్కనే అద్దెకు ఉoటున్న బలగం సత్యనారాయణ అనే వ్యక్తి ప్రవేశించాడు.
గౌరీదేవికి, ఒక సంవత్సర క్రితం బలగం సత్యనారాయణతో అక్రమ సంబంధం ఏర్పడింది. అక్రమ సంబంధం గుట్టు రట్టు కావడంతో, భర్త,కుటుంబ పెద్దలు వీరిని మందలించారు. దీంతో వీరి ఇరువురు పందలపాక నుండి పారిపోయి, నిడదవోలులోని సుబ్బరాజు పేటలో సహజీవనం సాగిస్తున్నారు. వ్యాపారం నిమిత్తం బలగం సత్యనారాయణ వేరే ఊరు వెళ్లి వస్తున్న క్రమంలో, ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్న గౌరీదేవిపై అనుమానం పెంచుకున్నాడు.
ఆమె పిల్లలను ఇంటి యజమాని అయిన వెంకటేశ్వరమ్మ ఇంటిలో వదిలి, వేరే గ్రామానికి వెళ్ళింది గౌరీదేవి. మంగళవారం గౌరీదేవి కుమారుడి పుట్టినరోజు కావడంతో, మరల నిడదవోలు లోని సుబ్బరాజు పేటకు వచ్చింది. కరెక్ట్ గా అదే సమయానికి నిఘావేసిన బలగం సత్యనారాయణ, ఈమె ఇంటి దగ్గరకు వచ్చాడు,
ఈమె ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి, విచక్షణ రహితంగా రెచ్చి పోతూ, కత్తి తో దాడి చేశాడు. ప్రాణ భయం ఆమె ప్రతి ఘటించడంతో ఆమెను చేతుల పైన, మెడ మీద, నరికాడు. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో సత్యనారాయణ అక్కడి నుండి పారిపోయాడు.
స్థానికులు, రక్తపు మడుగులో ఉన్న గౌరీదేవిని, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.