తనపై దాడి జరిగిందని ఒక దళిత మహిళ చెప్పినా, ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఉలకడం లేదు పలకడం లేదు.
వివరాలలోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన శిరీష కు పోయిన నెల వివాహం జరిగింది.
భర్త హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడని అక్కడకు కాపురానికి వెళ్ళింది.
కానీ అక్కడ భర్తతో ఆనందంగా జీవించవలసిన శిరీష నిత్యం ఆయన వేధింపులకు గురవుతూ నానా నరకం అనుభవించింది.
ఇదే విషయం తల్లికి పలుమార్లు తెలియజేయగా సర్దుకో అమ్మ కొత్తగా పెళ్లయింది ఈ విషయాలు బయటపడితే మన పరువు పోతుందని తల్లి సర్ది చెప్పింది.
భర్త వేధింపులు తాళలేక శిరీష అక్కడినుంచి వచ్చేసి ఆమె మునుపటిలాగా ఉద్యోగం చేసుకుంటూ ఏలూరులో ఉండిపోయింది.
అయితే తల్లి, భర్త కలిసి తనపై కేసు పెడతామని చెప్పడంతో జంగారెడ్డిగూడెం వచ్చింది.
అక్కడకు వచ్చి పోలీసులు వివరణ ఇద్దామని అనుకున్నదో ఏమో కానీ శిరీషకు వారు ఆ అవకాశం ఇవ్వలేదు.
తల్లి, భర్త వారితో బాటు సుబ్బారావు,రవీంద్ర కుమార్ అనే మరో ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
తల్లి, భర్తను పంపేసిన తర్వాత కూడా రవీంద్ర, సుబ్బారావు శిరీషను కొట్టి నానా చిత్రహింసలు పెట్టారు.
లైంగికంగా దాడి కూడా చేశారని శిరీష ఆరోపించింది.
వారి నుంచి తప్పించుకున్న శిరీష స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు.
అసలు పోలీసులు తనను పట్టించుకోలేదని తనతో పాటు వచ్చిన పెద్దలను కూడా పోలీసులు అగౌరపరిచారని శిరీష ఆరోపించింది.
తన తరపున వచ్చిన మధ్యవర్తులను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ల కొట్టారని శిరీష తెలిపింది.