బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు మొగుళ్ళ భద్రయ్య పై జరిగిన దాడిని పలువురు ఖండించారు. దాడి విషయం తెలుసుకొని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక బుధవారం ఉదయం వారి స్వగ్రామమైన కేశవాపురం గ్రామం చేరుకొని పరామర్శించారు. దాడి జరిగిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ములుగు-భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ అవినీతి అక్రమాలను జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హమని ఆయన అన్నారు.
ఈ సంఘటనకు సబ్ రిజిష్టర్ అనుచరుడైన బొచ్చు సమ్మయ్య మరో ఇద్దరు బాధ్యులని వారు అన్నారు. భద్రయ్య పై దాడి జరగడాన్ని తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి తీవ్రంగా ఖండించింది. సబ్ రిజిష్టర్ తస్లిమపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో పాల్గొన్న వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకు౦డా జాప్యం చేయడం పోలీసు వైఫల్యమని ఆయన అన్నారు.
ఈ సంఘటన నుంచి సబ్ రిజిస్టర్ తస్లిమను కాపాడటానికి కొంత మంది అధికారులు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఆమెను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తెలిపింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండపర్తి సమ్మయ్య ,కొండపర్తి సీతాదేవి, రజక సంఘం వెంకటపూర్ మండల అధ్యక్షులు ఓరుగంటి కుమారస్వామి, వెంకటపురం మండల అధ్యక్షులు కొండపర్తి గణేష్, గొల్లపల్లి తిరుపతి, గొల్లపల్లి సాంబయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.