2020లో ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలు పెరిగినట్లు జాతీయ నేర నమోదు బ్యూరో ఎన్సిఆర్బి వెల్లడించింది. రోజుకు సగటున 77 రేప్ కేసులు, 80 మర్దర్ కేసులు నమోదయ్యాయని, ఓవరాల్గా 28శాతం మేర కేసులు పెరిగాయని తెలిపింది.
పెరిగిన కేసుల్లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఎస్సిలపై నమోదైన నేరాలు, అకృత్యాలు దాదాపు 9.4శాతం పెరిగాయి. అంటే మొత్తంగా 50,291 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కేవలం మనోభావాలను దెబ్బతీసిన కేసులే 32.9శాతం కాగా ఎస్సి, ఎస్టి అత్యాచారాల నివారణ చట్టం కింద 8.5శాతం, నేరపూరితమైన రీతిలో అడ్డగించిన కేసులు 7.5శాతం వున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
వీటిల్లో ఎస్టిలపై పాల్పడిన నేరాలకు నమోదైన కేసులు 8,272గా వున్నాయి. అంటే 2019 కన్నా 9.3శాతం ఎక్కువగా వున్నాయి.
తగ్గిన దేశద్రోహం కేసులు..
ఇక దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాది తగ్గి 73కి చేరాయి. మణిపూర్లో 15, అస్సాంలో 12, కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్లో 7, హర్యానాలో 6, ఢిల్లీలో 5, కాశ్మీర్లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం పెరిగాయి. లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
2020లో భారతీయ శిక్షా స్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. బమొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖలయ్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గాయని తెలిపింది.
2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.
దాడుల్లో యూపీదే తొలిస్థానం..
ఎస్సీలపై దాడుల్లో ఉత్తరప్రదేశ్ అగ్ర భాగాన నిలిచింది. ఒక్క యూపీలోనే ఈ ఏడాది 11,829 కేసులు నమోదు కాగా, రాజస్థాన్లో 6,794, బీహార్లో 6,544 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఎస్సీ మహిళలపై దేశ వ్యాప్తంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీలపై అత్యాచార కేసుల్లో రాజస్థాన్ తొలి స్థానంలో నిలవగా, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
రాజస్థాన్లో 554 కేసులు, యూపీలో 537, మధ్యప్రదేశ్లో 510 కేసులు నమోదు అయ్యాయి. ఎస్టీలపై దాడులకు గానూ 2019 ఏడాదిలో 8,257 కేసులు నమోదు కాగా, 2018లో కేవలం 6,528 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. గతేడాదితో పోల్చితే 2019లో 26.5 శాతం కేసులు పెరిగాయి. ఎస్టీలపై దాడుల్లో మధ్యప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది.
ఆ రాష్ట్రం లో 1,922 కేసులు, రాజస్థాన్లో 1,797, ఒడిశాలో 576 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎస్టీ మహిళలపై జరిగిన అత్యాచారం కేసుల్లోనూ మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 358 కేసులు నమోదు కాగా, ఛత్తీస్గఢ్లో 180, మహారాష్ర్టలో 114 కేసులు నమోదు అయ్యాయి.