ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కొందరు మధ్యవర్తులు మొదలు నుండి చివరి వరకు అక్రమాలకు, అవకతవకలకు పాల్పడుతునే ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 244 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత భర్తీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులపై ఒత్తిడి చేసినప్పటికీ మధ్యవర్తుల ఆగడాలు ఆగడం లేదు.
నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు మధ్యవర్తులు డబ్బుల వసూళ్ల దందా సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు అమ్మాయి లకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి లక్ష నుంచి లక్షన్నర వరకు డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతం ఒకటి వెలుగు చూసింది.
ఉద్యోగాల భర్తీలో మొదటి నుండి అవకతవకలపై పోరాడుతున్న టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తాజాగా మధ్యవర్తుల మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. నిర్మల్ కు చెందిన ముగ్గురు అమ్మాయి లకు ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు ఓ మధ్యవర్తి లక్ష నుంచి లక్షన్నర వరకు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఆడియో టేప్ విషయాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దృష్టికి గోవర్ధన్ రెడ్డి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్ వివరించి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం గోవర్ధన్ రెడ్డి బాధిత అమ్మాయిలతో కలిసి రిమ్స్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో డైరెక్టర్ కరుణాకర్ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో టేప్ ఆధారంగా నిర్మల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో మొదటి నుండి అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతోందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక వరకు నిబంధనల ప్రకారమే అధికారులు ప్రక్రియను పూర్తి చేశారని నమ్మకాన్నీ ఆయన వ్యక్తం చేశారు. అయినా మధ్యవర్తులు నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు. తాజాగా నిర్మల్ అమ్మాయిలకు డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునేలా నిర్మల్ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు