జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా తాంగ్ధర్ రీజియన్ లో మంచు కొండ చరియ విరిగిపడి ముగ్గురు భారత సైనికులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు అందులో చిక్కుకోగా సైనిక దళాలు కాపాడాయి. గల్లంతయిన ముగ్గురు సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.
బందీపురాలో కూడా ఇలానే మంచు కొండ చరియ విరిగిపడింది. ఇందులో కూడా కొందరు జవాన్లు చిక్కుకున్నట్లు తెలిసింది. అక్కడ కూడా సైనిక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నవంబర్ 30న దక్షిణ సియాచిన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న సైనిక బృందంపై మంచి కొండ చరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. ఈ దక్షిణ సియాచిన్ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.
ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించడం అత్యంత కష్టసాధ్యమైన విషయం అయితే భారత సైన్యం ఇలాంటి వాటికి వెరవకుండా దుస్సాధ్యమైన ప్రాంతాలలో కూడా గస్తీని వదలడం లేదు. మంచు కొండ చరియలు విరిగిపడుతుండటం సర్వ సాధారణంగా మారడంతో సైనిక హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతున్నారు. కొండ చరియలు విరిగిపడినప్పుడు తక్షణ సాయం అందించే బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.