విజయనగరం జిల్లాలో మూడు దఫాలుగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజకుమారి అభినందించారు.
అంతే గాక ఒక్కొక్కొరికీ ప్రశంసా పత్రాలను, వెయ్యి రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో క్షేత్ర స్థాయి నుండి సమాచారాన్ని సేకరించడం, ఇతర కార్యాలయాల నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని వచ్చి, ఉన్నతాధికారులకు పంపడంలోను సమర్ధవంతంగా పని చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
అలాగే ఎలక్షన్ సెల్ సిబ్బందిని, ఎన్నికల్లో మద్యం, సారా, నగదు అక్రమ రవాణాను నియంత్రించడం, జూదం, కోళ్ల పందాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాల నియంత్రణలో సమర్ధవంతంగా పని చేసి, గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయుటలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్నైపరు టీం సభ్యుల జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ విధమైన స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికలలో కూడా చూపించి విజయవంతంగా పూర్తి చేసే విధంగా పని చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ రాజకుమారి సూచించారు. జిల్లా ఎస్పీ నుండి ప్రశంసా పత్రాలు పొందిన వారిలో స్పెషల్ బ్రాంచ్ సీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, ఎస్ఏలు ఎ.అశోక్, ధనుంజయ నాయుడు, గంగరాజు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, స్పెషల్ బ్రాంచ్ సీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, స్నైపర్ టీం సభ్యులు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.