ఉప్పల్ నియోజకవర్గంలోని కమల నగర్ లోని అయ్యప్ప దేవాలయంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవం కనుల పండువగ జరిగింది. మంగళవారం రాత్రి మౌలాలి గాయత్రి నగర్ వీరాంజనేయ స్వామి దేవాలయం నుంచి కమల నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వరకు మహిళలు , భక్తులు దీపారాధనలతో భారీ ఊరేగింపు చేపట్టారు.
కమల నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులు, మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తులు స్వామివారి రథాన్ని పురవీధుల్లో తిప్పుతూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు కావడి నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలో నృత్యాలు చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి శరణు ఘోషలతో కమలానగర్ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయంలో అయ్యప్ప స్వామికి భారీ పుష్పాభిషేకం చేసి అయ్యప్ప పడి పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం అయ్యప్ప స్వామి భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు ఎస్ఆర్ నాయర్, మాలధారంలో ఉన్న అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా