వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల అద్వర్యంలో మహా పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. అయ్యప్ప గురుస్వాములు పాడిన భక్తి భజన గీతాలు, ఆధ్యాత్మిక భావనను నింపాయి. అయ్యప్ప మాలదారులు ఆలపించిన భక్తి గీతాలు, కీర్తనలు, భజనలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి.
దీంతో మహాపడిపూజ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగింది.స్వామియే.. అయ్యప్పో.. అయ్యప్పో.. స్వామియే అంటూ.. స్వామి నామస్మరణతో తాండూరు జూనియర్ కళాశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి.
అయ్యప్పమాలదారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం మహా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని అయ్యప్పస్వామిని వేడుకున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మురళీకృష్ణ గౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత, రాజన్ గౌడ్, శ్రవణ్, రఘుమారెడ్డి, రవికాంత్ రెడ్డి, ఇంతియాజ్, నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, తాండూరు నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.