మన దేశ స్వాతంత్ర్య సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. కర్నూలు జిల్లా డోన్ లోని విజ్ఞాన్ హైస్కూల్ లో మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి జరిగింది.
ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంటు డి.అక్బర్ పాషా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ పేదరికంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుండి ధైర్యసాహసాలు చూపేవారని, ప్రజల నీరాజనాలు అందుకున్న మహావీరుడు ఆయన అన్నారు.
1921లో గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చినప్పుడు చంద్రశేఖర్ కూడా జనంతో కలిసి వందేమాతరం, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తుంటే పోలీసులు కొట్టారని రఫీ గుర్తు చేశారు. ఇలాంటి మహానుభావులను అనుక్షణం స్మరించుకుంటూ, గుర్తుచేసుకొని వారి ఆశయాల సాధనలో భాగస్వాములు కావాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.