ఉన్నతస్థితి నుండి అత్యుత్తమమైన స్థితికి ఎదగాలంటే ప్రయత్నం వైపు మనసు మళ్లించడానికి దివ్యాంగులు ధృఢ చిత్తం అలవర్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసమే సృజనాత్మకతను వెలికి తీస్తుందని, ఎటువంటి వైకల్యమైనా సంకల్పం ముందు దాసోహమేనని అన్నారు.
వైకల్యంతో మానసికంగా కృంగిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారని, అయితే మనో సంకల్పం ముందు వైకల్యం అవరోధం కాదని, మనో ధైర్యమే విజయానికి అసలైన సాధనాలని అన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం నేరుగా సంప్రదిస్తే సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు డిసెంబర్ నెలాఖరు లోగా చర్యలు తీసుకుంటామని, బాలికల వసతి గృహంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులు చేపట్టుటకు ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కి సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చొరవచూపాలని అన్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతి కాకుండా సహానుభూతి మెలగాలని, వారికి సేవ చేసేందుకు భాగస్వామ్య పద్దతిలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
డీఆర్డీవో ఆకవరం శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అనేక సంక్షేమ శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా డా|| కె.అనితారెడ్డి మాట్లాడుతూ ఆనందం అంటే మనం సంతోషంగా ఉండడం కాదని పదిమందిని సంతోషపెట్టడం అని అన్నారు. మానసిక దివ్యాంగులు, బధిరుల, పిల్లలతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని, మానవ సేవ మాధవ సేవ అని అన్నారు. దివ్యాంగుల సేవ దైవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ కే అనితా రెడ్డి,విద్యా ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ల మహేందర్, సూపరింటెండెంట్ ఆర్ శ్రీనివాస్, సి డి పి వో లు కే మధురిమ, సౌందర్య, సీనియర్ సహాయకులు వెంకట్ రామ్ , ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, దివ్యాంగుల సంఘ ప్రతినిధులు నల్లెల రాజయ్య, మహేందర్, అజీమ్, సురేష్, భరత్, ఉమ,నర్సమ్మ, ఐ సి డి ఎస్ అధికారులు పద్మ, భగవత్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.