చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీదేవి…. ఈ 27 ఏళ్ల ఫెన్సర్ ఇప్పుడు భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఒలింపిక్స్ క్రీడల్లో భాగమైన ఫెన్సింగ్ క్రీడలో తొలిసారిగా భారత్ క్వాలిఫై అయింది ఈ భవానీదేవి వల్లే. కొరియా చేతిలో హంగేరీ పరాజయం పాలు కావడంతో విచిత్రంగా భారత్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
భారత్ తరపున ఫెన్సింగ్ లో పొల్గొంటున్న భవానీదేవి సాధారణ పూజారి కుమార్తె అని తెలిస్తే ఆశ్చర్య పోతారు. పది సంవత్సరాల వయసులో చెన్నైలో చదువుకుంటున్న సమయంలో ఫెన్సింగ్ క్రీడ గురించి తెలుసుకుని అందులో ప్రవేశించిన భవానీదేవి ఇప్పుడు ఒలింపిక్స్ కు చేరింది. 14 సంవత్సరాల వయసులో కేరళలో తర్ఫీదు తీసుకున్నది.
ఒకపక్క చదువుల్లో రాణిస్తూ మరో వైపు క్రీడారంగంలో కూడా అగ్రశ్రేణి జాబితాలో చేరడం అంటే మాటలు కాదు. అందుకోసం ఎంతో శ్రమపడ్డ భవాని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. భవాని 1993 ఆగస్టు 27న చెన్నైలో ఆనంద సుదరం, రమణి దంపతులకు జన్మించింది.
2009 కామన్ వెల్త్ గేమ్స్ లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై రజత పతకం సాధించింది. 2018 కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించి ఫెన్సింగ్ క్రీడలో తొలి బంగారుపతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
కుమార్తె క్రీడా భవిష్యత్తు కోసం ఆర్ధిక ఇబ్బందులు ఎదురు కాగా వాటిని అధిగమించడానికి ఆమె తల్లి తన బంగారు నగలు అన్నింటిని అమ్మేసింది. పేదరికం నుంచి అంతర్జాతీయ క్రీడాస్థలిపైకి చేరిన మరో ఆణిముత్యం భవానీదేవి.