దేశంలోనే అతిగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తమదేనని వైసీపీ నాయకులు తరచూ చెబుతుంటారు. వైసీపీ నాయకులే కాదు… ముఖ్యమంత్రి జగన్ కూడా దేవుడి దయవల్ల దేశంలోనే తమ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు. ఆదాయం బాగా ఉందని అందువల్ల అభివృద్ధికి ఢోకాలేదని కూడా ఆయన చెప్పారు. ఇదంతా నిజమని చాలా మంది నమ్ముతున్నారు కూడా.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేడు చేసిన ట్విట్ చూస్తే అదంతా ఉత్తిదేనని తేలుతున్నది. విష్ణువర్ధన్ రెడ్డి దీనికి సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల కొనుగోలు భారీగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. దేశంలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు 26.05 % పెరగగా, ఏపీలో మాత్రం 6.52 % తగ్గాయి.
ఏపీలో మొత్తం వాహనాల కొనుగోళ్లు 1.80% తగ్గాయి. ఏపిలో ద్విచక్ర వాహనాల కొనుగోలు ఎందుకు తగ్గింది? అనేది ప్రధాన ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అమోఘమని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటుండగా, కొనుగోలు శక్తి మందగించి జనం అవస్థలు పడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోయలేని పన్నుల భారం ప్రజల్ని మరింత కుంగదీస్తోందని ఆయన తెలిపారు. దీనితో బాటు ఆకారమే లేని రోడ్ల దెబ్బకి భయపడి రాష్ట్ర ప్రజలు ద్విచక్రవాహనాల కొనుగోలు కూడా తగ్గించేశారని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్విట్ కు అధికార వైసీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.