తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కడప జైలులో ఆయనకు కరోనా సోకింది. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని.. అత్యవసర పరిస్థితిని గుర్తించి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
దీంతో తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన బెయిల్పై విడుదల కానున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిలపై అక్రమ వాహనాల కేసులో గతంలో అనంతపురం పోలీసులు అరెస్టు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. 55 రోజులపాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. బెయిల్పై విడుదలైన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే కేసు నమోదు చేశారు. తాడిపత్రి సీఐ ని దుర్భాషలాడారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు.
రిమాండ్ నిమిత్తం వారం క్రితం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.