ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మతానికి అనుకూలంగా ప్రవర్తిస్తుండటం కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతున్నదని బిజెపి నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు.
మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రభుత్వ యంత్రాంగం ఒక మతానికి చెందిన వారిని కట్టడి చేయలేకపోతున్నదని ఆయన అన్నారు. మార్చి 13 నుంచి 19 వరకూ ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కు కర్నూలు నగరం నుంచి 500 మంది ముస్లింలు హాజరయ్యారని ఆయన తెలిపారు.
నిజాముద్దీన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వీరంతా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందించే పని లోనే నిమగ్నమై ఉన్నారని ఆయన అన్నారు. మార్చి 24న లాక్ డౌన్ విధించిన తర్వాత వీరంతా కర్నూలు లోని కెఎం హాస్పిటల్ అనే ఒక ప్రయివేటు ఆసుపత్రికి వెశ్లారని, లాక్ డౌన్ నిబంధనలను వీరు పూర్తిగా విస్మరించారని బైరెడ్డి రాజశేఖరరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 10 వరకూ కెఎం ఆసుపత్రి డాక్టర్ కనీసం 4000 మంది ముస్లింలకు నిబంధనలకు విరుద్ధంగా కరోనాకు ట్రీట్ మెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఏప్రిల్ 13న ఆ డాక్టర్ కరోనా వైరస్ సోకడంతో మరణించాడని బైరెడ్డి వెల్లడించారు.
ఇప్పుడు ఆ డాక్టర్ కు చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకి ఉందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జీ వీర పాండియన్, కర్నూలు ఎమ్మెల్లే హఫీజ్ ఖాన్ ప్రయివేటు ఆసుపత్రికి కరోనా రోగులను పంపించడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లా, తెలంగాణలోని గద్వాల జిల్లాల్ల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేవలం ఇది ఒక్కటే కారణమని బైరెడ్డి తెలిపారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు గా ఉన్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపాలని చెప్పినా ముఖ్యమంత్రి వినలేదని ఆయన అన్నారు. మంత్రులు, వైసీపీ నాయకులు గుంపులు గుంపులుగా తిరుగుతూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తుండటమే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో మసీదులు, చర్చిలలో ప్రార్ధనలు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. రెండు జిల్లాలు తప్ప రాష్ట్రం మొత్తం రెడ్ జోన్ కింద ప్రకటించినందున తక్షణమే మెడికల్ అండ్ హెల్త్ విషయాలను కేంద్రం స్వాధీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాలని ఆయన ప్రధానికి పంపిన లేఖలో కోరారు.