తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకడైన బాలకృష్ణ ను చిరంజీవి, నాగార్జుల లాంటి వారు ఒంటివాడిని చేసినట్లుగా కనిపిస్తున్నది. కరోనా లాక్ డౌన్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వెసులుబాటు కల్పించే విషయంలో తెలుగు సినీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
అయితే ఈ చర్చలలో బాలకృష్ణకు స్థానం కల్పించలేదు. పైగా ఆయనకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని బాలకృష్ణ పరోక్షంగా వెల్లడించారు. సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నట్లు చెప్పారు.
జూన్లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. షూటింగ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ కోరారు. షూటింగ్ సమయంలో సామాజిక దూరం పాటించాలని సినీ పరిశ్రమకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.