తను నటించిన నర్తనశాల చిత్రం సన్నివేశాలను ఈ నెల 24న విడుదల చేయబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది అంటూ ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
‘‘ నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేస్తున్నాము’’ అని ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నానని బాలకృష్ణ తెలిపారు.