నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మార్చి- ఏప్రిల్ నెలలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయా ప్రాంతాలకు చెందిన 18 కోట్ల భారతీయ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు.
పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తన బలాన్ని పుంజుకునేందుకు భాజపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అస్సాం, పుదుచ్చేరిలలో అధికారం నిలబెట్టుకునేందుకు సకల శక్తియుక్తులు ప్రదర్శిస్తోంది. ఒక్కసారి
2016 ఎన్నికలఫలితాలు పరిశీలిస్తే … పైన తెలిపిన 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాజపా పోటీ చేసిన మొత్తం 824 అసెంబ్లీ స్థానాలలో కేవలం 64 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ…2019 పార్లమెంట్ ఎన్నికలనాటికి ముఖచిత్రం పూర్తిగా మారి పోయింది.
చాలా రాష్ట్రాలలోని పార్లమెంట్ స్థానాలలో భాజపా విజయకేతనం ఎగురవేయగలిగింది. ప్రస్తుతానికి వస్తే….రానున్న ఎన్నికలలో విజయావకాశాలు ఏ పార్టీకి ఎలా ఉండగలవనే చర్చ రాజకీయ వర్గాలలో ఊపందుకుంది.
దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు భాజపా ముమ్మర ప్రయత్నం చేస్తోంది. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో ప్రధానపోటీ ఎల్ డీ ఎఫ్, యూ డీ ఎఫ్ మధ్యనే ఉండే అవకాశం ఉంది. భాజపాకు కేవలం 2 స్థానాలలో గెలిచే బలం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు (234)లో డీ ఎమ్ కే ,కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని సమాచారం . ఏ ఐ డీ ఎమ్ కే ,బీజేపీ కూటమికి 50- 55 స్థానాలకు మించి గెలవడం అసాధ్యమని పరిశీలకుల అంచనా.
294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలో ని తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికార పీఠం నిలబెట్టుకోగలదని ఎన్నికలసర్వేల అంచనా.
ఇక…అస్సాం, పుదుచ్చేరిలలో భాజపా విజయం ఖాయమని వినిపిస్తోంది. ఎన్నికలలో రాజకీయపార్టీలు ఇచ్చే హామీలు ఓటర్లపై తీవ్రప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం రైతులు చేస్తున్న సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమ ప్రభావం ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేయగలవో వేచిచూడాలి. అదే విధంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు కూడా ఓటరు మనసును మార్చవచ్చు.
సీ ఏ ఏ చట్టం నిర్బంధ అమలు అంశం లక్షితవర్గాలను ఏ స్థాయిలో ఉద్రిక్తతకు లోను చేయగలదో కూడా స్పష్టం కావాల్సివుంది. కరోనా సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగా మని చెప్పుకుంటున్న అధికార బీజేపీ కి ఈ ఎన్నికలు ఓ పరీక్షగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు భావి సూచికలు కాగలవని సర్వత్రా వినిపిస్తోంది. వివిధ రాజకీయపార్టీల పనితీరుపై ఓటర్ల అంతిమ తీర్పు ఏమిటో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వెల్లడికాగల మే నెల 2 వ తేదీవరకు నిరీక్షించకతప్పదు.
పొలమరశెట్టి కృష్ణారావు