ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు హుజూరాబాద్ బయలుదేరిన బండి సంజయ్ ఉదయం సతీ సమేతంగా హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి ఆశీస్సులందుకున్న బండ సంజయ్ దంపతులు అమ్మవారి ఆశీస్సులతో ప్రశాంత వాతావరణంలో పూజలు చేసారు. తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతమైన నేపథ్యంలో బండి సంజయ్ ముక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ పూజారుల వేద మంత్రోచ్చారణలతో అమ్మవారి ఆశీస్సులందచేశారు. తనతోపాటు ప్రజా సంగ్రామ యాత్రలో పూర్తిగా పాల్గొని అడుగులో అడుగు వేసిన పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తోపాటు సంగ్రామ సేనను బండి సంజయ్ ప్రత్యేకంగా పిలిపించి వారితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పాదయాత్రను విజయవంతం చేసి పాతబస్తీలో అడుగుపెట్టిన బండి సంజయ్ దంపతులకు బీజేపీ కార్యకర్తలు పాతబస్తీలో ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ‘జై బీజేపీ, జై బండి సంజయ్ ’అంటూ నినాదాలు చేశారు.
భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆగస్టు 28న అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి విజయవంతమైంది. భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల ముందు ప్రణమిల్లి ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మవారు ఇచ్చిన బాధ్యతలను నాతోపాటు బీజేపీ కార్యకర్తలు నెరవేర్చాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రజా ప్రవాహం మధ్య పాదయాత్రను పూర్తి చేశాను. అమ్మవారు మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే నెరవేర్చేందుకు నేను, బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం’’అని తెలిపారు.
హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాం. అందుకోసం హుజూరాబాద్ బయలుదేరి వెళుతున్నా ‘‘కంకణం కట్టుకుందాం – కమలం పార్టీని గెలిపిద్దామన్నారు…అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గడప గడపకూ వెళ్లి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతా అని పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కలిసి హుజూరాబాద్ బయలుదేరి వెళ్లారు.