నిర్మల్ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు బ్యాంకులు పారిశ్రామిక రంగానికి అధిక రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ, డి ఎల్ ఆర్ సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామిక రంగానికి అధికరణాలు మంజూరు చేయాలని ముఖ్యంగా రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు మొదలగు వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ యూనిట్లను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరేలా చూడాలన్నారు. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద రైతులకు చిన్న వ్యాపారస్తులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల లబ్ధిదారులకు స్వయం సహాయక బృందాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో నాబార్డ్ డి డి ఎం పురోహిత్, ఆర్బిఐ ఎల్ డి ఓ సాయి చరణ్, ఎల్ డి ఎం హరి కృష్ణ, బ్యాంకు మేనేజర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.